గత 6 నెలల నుంచి స్తబ్ధత
ఆర్థిక మాంద్యం స్థిరాస్తి రంగాన్ని కుదేలు చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి భూముల కొనుగోళ్లు, స్థలాల క్రయ, విక్రయాలు పడిపోయాయి. పెరిగిన ధరలు కూడా రియల్టీపై ప్రభావం చూపాయి. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ సహా తెలంగాణలో పరిస్థితి కాస్త మెరు గ్గానే ఉన్నా కొనుగోలుదారులు వేచిచూసే ధోరణి అవలం బించడంతో స్థిరాస్తి వ్యాపారం చతికిలపడింది. ఈ ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతామని భావి స్తున్న తరుణంలో కరోనా వైరస్ దేశాన్ని చుట్టేసింది. దీంతో లాక్డౌన్ ప్రకటించడం ఇళ్ల నుంచి కాలు బయట మోపే పరిస్థితి లేకపోవడంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టినవారు లబోదిబోమంటున్నారు. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వాతావరణం కనిపించకపోవడంతో 4–5 నెలల్లోనే లేఅవుట్ లేదా డెవలప్మెంట్ చేసి పెట్టుబడులు రాబట్టాలనుకొనే వారిని వడ్డీల భారం నడ్డి విరచడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆదాయం గగనమే!
ప్రభుత్వ ఆదాయార్జన శాఖల్లో ముఖ్యమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై కరోనా ప్రభావం పడింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి గండిపడుతోంది. స్థిరాస్తుల లావాదేవీలు, ఇతర డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతి నెలా ఖజానాకు రూ. 560 కోట్ల ఆదాయం వచ్చేది. సెలవులు పోను రోజుకు రూ. 23 కోట్ల మేర లభించేది.